జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ గుర్తుకొస్తున్నాడు: అచ్చెన్నాయుడు

  • తమ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న అచ్చెన్నాయుడు
  • వైఎస్ మరణం వెనుక రిలయన్స్ ఉందని చెప్పినవారు ఇప్పుడు చంద్రబాబుపై పడుతున్నారని మండిపాటు
  • అధికారంలో ఉన్న కాలంలో వివేకా హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్న

వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ టీడీపీ, చంద్రబాబు హయాంలోనే జరిగాయంటూ జగన్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన.. జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ సినిమా పాత్ర గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు.


జగన్ తాత రాజారెడ్డిని ఎందుకు హత్య చేశారో, ఆనాటి వైఎస్ కుటుంబ అరాచకాలను బాధితుడు పార్థసారథిరెడ్డి స్వయంగా వివరించారని అచ్చెన్న గుర్తుచేశారు. రాజారెడ్డి హత్య కేసులో ఉన్న వ్యక్తి ఇవాళ వైసీపీలోనే కొనసాగుతుండటం జగన్ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ఇక అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన రెండు రోజులకే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారంటూ జగన్ చేస్తున్న ప్రచారం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఆనాడు తిరుమల వేంకటేశ్వర స్వామికి కీడు తలపెడితే మంచి జరగదని మాత్రమే చంద్రబాబు అన్నారని, గతంలో వైఎస్సార్ మరణం వెనుక 'రిలయన్స్' ఉందన్న వారే ఇప్పుడు చంద్రబాబుపై పడుతున్నారని ధ్వజమెత్తారు.


అలాగే బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని మొదట గుండెపోటు అని నమ్మించి, ఆపై గొడ్డలితో నరికి చంపిన చరిత్ర వారిదేనని.. అందుకే వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నామని స్పష్టం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా వివేకా హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయారో జగన్ సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు నిలదీశారు.


Atchannaidu
YS Jagan
Chandrababu Naidu
TDP
YSRCP
YS Vivekananda Reddy murder
Raja Reddy murder
Andhra Pradesh politics
Aparichitudu movie
political criticism

More Telugu News